IND vs ENG: జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్‌ఇండియా భారీ స్కోర్‌

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆట పూర్తయింది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ రవీంద్ర జడేజా (104; 194 బంతుల్లో 13x4) శతకం బాదాడు...

Updated : 02 Jul 2022 18:00 IST

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆట పూర్తయింది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ రవీంద్ర జడేజా (104; 194 బంతుల్లో 13x4) శతకం బాదాడు. 338/7 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం రెండోరోజు మహ్మద్‌ షమి(0)తో కలిసి బ్యాటింగ్‌ ఆరంభించిన అతడు 183 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో మూడంకెల స్కోర్‌ అందుకున్నాడు. ఈ క్రమంలోనే షమి(16; 31 బంతుల్లో 3x4)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 48 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 80వ ఓవర్‌ చివరి బంతికి షమి షాట్‌పిచ్‌ బంతిని గాల్లోకి ఆడి క్రాలే చేతికి చిక్కాడు. దీంతో టీమ్‌ఇండియా 371 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే జడ్డూ సైతం అండర్సన్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్‌ 375/9గా నమోదైంది.

తర్వాత క్రీజులోకి వచ్చిన బుమ్రా (31 నాటౌట్‌; 16 బంతుల్లో 4x4, 2x6) సంచలన బ్యాటింగ్ చేశాడు. బ్రాడ్‌ వేసిన 84వ ఓవర్‌లో చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో (4, 5 వైడ్లు, 6 నోబాల్‌, 4, 4, 4, 6, 1) కొట్టడంతో 35 పరుగులు రాబట్టాడు. దీంతో టెస్టుల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే, అండర్సన్‌ వేసిన మరుసటి ఓవర్‌ ఐదో బంతికి సిరాజ్‌ (2) ఔటవ్వడంతో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో చివరికి భారత్‌ 416 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు తొలిరోజు టీమ్‌ఇండియా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సయమంలో రిషభ్‌ పంత్‌ (146; 111 బంతుల్లో 20x4, 4x6), జడేజా ఆరో వికెట్‌కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇలా టీమ్‌ఇండియా టెస్టుల్లో 100లోపే ఐదు వికెట్లు కోల్పోయాక 400 పైచిలుకు పరుగులు చేయడం ఇది మూడోసారి.

ఇది వరకు..

* 2013లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో ఆడిన సందర్భంగా 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా చివరికి 453 పరుగులు చేసింది.

* అంతకుముందు 1983లో చెన్నై వేదికగా వెస్టిండీస్‌ జట్టుతోనే తలపడిన సందర్భంగా 92 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. అప్పుడు చివరికి 451 పరుగులు చేసింది.

ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు..

* బుమ్రా 29 పరుగులు.. ఎక్స్‌ట్రా 6 పరుగులు (మొత్తం 35 రన్స్‌) స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఇదే మ్యాచ్‌లో.

* బ్రియాన్‌ లారా 28 పరుగులు.. 2003లో జోహెనస్‌బర్గ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ పీటర్సన్‌ బౌలింగ్‌లో.

* బెయిలీ 28 పరుగులు.. 2013లో పెర్త్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జేమ్స్‌ అండర్సన్‌ బౌలింగ్‌లో.

* కేశవ్‌ మహారాజ్‌ 28 పరుగులు.. 2020లో పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జోరూట్‌ బౌలింగ్‌లో.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని