Miss India: అందాల కిరీటం అందుకుని.. రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి!

రెడ్‌ కార్పెట్‌పై అతివల హొయలు, జిగేలుమనిపించే దుస్తులు, రెప్పపాటు కాలంలో లెక్కలేనన్ని కెమెరా ‘క్లిక్‌’లు.. ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో కనిపించే సందడి ఇది . ఎప్పటిలానే ఈ ఏడాదీ ‘మిస్‌ ఇండియా’ను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమైంది.

Updated : 02 Jul 2022 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెడ్‌ కార్పెట్‌పై అతివల హొయలు, జిగేలుమనిపించే దుస్తులు, రెప్పపాటు కాలంలో లెక్కలేనన్ని కెమెరా ‘క్లిక్‌’లు.. ‘మిస్‌ ఇండియా’ (Miss India) పోటీల్లో కనిపించే సందడి ఇది. ఎప్పటిలానే ఈ ఏడాదీ ‘మిస్‌ ఇండియా’ను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమైంది. ముంబయి వేదికగా జులై 3న ‘గ్రాండ్‌ ఫినాలే’ జరగనుంది. ఈ పోటీలకు సిద్ధమైన రాజశేఖర్‌ కుమార్తె చివరి నిమిషంలో తప్పుకొన్నారు. ఈ సందర్భంగా అసలు ఈ అవార్డుల ప్రదానోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది? ఇక్కడ విజేతగా నిలిచి, చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టివారెవరు? నటిగా కొనసాగుతూ అందాల కిరీటం అందుకున్నదెవరు? తెలుసుకుందాం..!

* అతివలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే పోటీల్లో ‘మిస్‌ ఇండియా’ ఒకటి. ఈ కిరీటం అందుకున్న విజేత, రన్నరప్‌గా నిలిచిన వారికి ‘మిస్‌ వరల్డ్‌’, ‘మిస్‌ యూనివర్శ్‌’, ‘మిస్‌ ఇంటర్నేషనల్‌’, ‘మిస్‌ ఎర్త్‌’ పోటీలకు ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. 

1947లో తొలిసారి ‘మిస్‌ ఇండియా’ పోటీలు నిర్వహించారు. ఈ కిరీటాన్ని అందుకున్న తొలి మహిళగా ప్రమీల (ఎస్తేర్‌ విక్టోరియా అబ్రహాం) నిలిచారు. పలు బాలీవుడ్‌ చిత్రాలకు డ్యాన్సర్‌గా పనిచేసిన ఈమె మరికొన్ని చిత్రాల్లో ‘స్టంట్‌ స్టార్‌’గా కనిపించారు. ఆ తర్వాత కథానాయికగా మారారు. బాలీవుడ్‌లో సినిమాలు నిర్మించిన తొలిసారి మహిళా నిర్మాతగా ప్రమీల చరిత్ర సృష్టించారు.

* 1952లో రెండు సార్లు ఈ పోటీలు జరగ్గా ఇంద్రాణి రెహమాన్‌ (ప్రముఖ క్లాసికల్‌ డ్యాన్సర్‌), నూతన్‌ విజేతలుగా నిలిచారు. నూతన్‌.. బాలనటిగా బాలీవుడ్‌ రంగ ప్రవేశం చేశారు. అలా రంగుల ప్రపంచంలో ఉంటూనే ఇటు అందాల పోటీలో పాల్గొని, సత్తా చాటారు. 1953లో పీస్‌ కన్వాల్‌ (బాలీవుడ్‌ నటి), 1954లో ‘మిస్‌ ఇండియా’గా మారిన లీలా నాయుడు.. ‘అనూరాధ’ అనే హిందీ చిత్రంతో నాయికగా మారారు. 1955 నుంచి 1958 వరకు ఈ వేడుకలు జరగలేదు.

* ఈ ‘మిస్‌ ఇండియా’ పోటీలను కోల్‌కతా స్థానిక మీడియా (1947- 1954) నిర్వహించింది. ఆ తర్వాత, 1959లో ‘ఈవ్స్‌’ (ముంబయి) అనే వీక్లీ మ్యాగజైన్‌ సంస్థ ఆ బాధ్యతలు తీసుకుంది. 1964 నుంచి వీటిని ‘ఫెమినా’ నిర్వహిస్తోంది. ఫెమినా మిస్‌ ఇండియా (Femina Miss India) తొలి పోటీల్లో గెలిచిన మహిళ మెహర్‌ కాస్టిలినో.


* 1981లో మీనాక్షీ శేషాద్రి ‘మిస్‌ ఇండియా’ (ఈవ్స్‌)గా గెలిచారు. 17 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించారు. క్లాసికల్‌ డ్యాన్సర్‌ అయిన మీనాక్షి ‘పెయింటర్ బాబు’ అనే హిందీ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేశారు. ‘ఆపద్బాంధవుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.


* 1993లో నమ్రతా శిరోద్కర్‌ ‘మిస్‌ ఇండియా’ టైటిల్‌ గెలుచుకున్నారు. 1998లో ‘జబ్‌ ప్యార్‌ కిసిసే హోతా హై’ అనే హిందీ చిత్రంతో తెరంగేట్రం చేశారు. మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘వంశీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆయన్నే వివాహమాడిన సంగతి తెలిసిందే.


* 1994లో నిర్వహించిన పోటీల్లో సుస్మితాసేన్‌కు ‘అందాల’ కిరీటం దక్కింది. 18ఏళ్ల వయసులో ఈ కీర్తిని సంపాదించిన వారిలో సుస్మిత ఒకరు. అదే ఏడాది ఆమె ‘మిస్‌ యూనివర్స్‌’గానూ నిలిచారు. ఇలా వచ్చిన క్రేజ్‌తో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘దస్తక్‌’ అనే బాలీవుడ్‌ చిత్రంతో ఆమె తెరంగేట్రం చేశారు.


* సుస్మితాసేన్‌ విన్నర్‌గా నిలిచిన ‘మిస్‌ ఇండియా’ కాంటెస్ట్‌లో పాల్గొన్న ఐశ్వర్యరాయ్‌ రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత, ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటం దక్కించుకున్నారు. ఇదీ 1994లోనే. ‘మిస్‌ వరల్డ్‌’ అయిన ఐశ్వర్య నటించిన తొలి చిత్రంగా ‘ఇరువర్‌’ (తెలుగులో ‘ఇద్దరు’) నిలిచింది. 1997లో తెరకెక్కిన ఈ చిత్రంతోపాటు ‘ఔర్‌ ప్యార్‌ హో గయా’ అనే హిందీ సినిమాలోనూ ఆమె నటించారు.


1995లో ‘గ్లాడ్‌రాగ్స్‌ మెగా మోడల్‌ ఇండియా’, 1997లో ‘మిస్‌ ఇంటర్‌కాన్టినెంటల్‌’ అనే టైటిల్స్‌ గెలిచిన లారా దత్తా 2000లో ‘మిస్‌ ఇండియా’ విజేతగా నిలిచారు. అదే ఏడాది ‘మిస్‌ యూనివర్స్‌’ అయ్యారు. 2003లో వచ్చిన ‘అందాజ్‌’ అనే హిందీ చిత్రంతో నటిగా మారారు.


* 1997 ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో దియానా హెడెన్‌ విజేతగా నిలిచారు. అదే ఏడాది ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటం ధరించారు. ‘తెజాబ్‌’ అనే చిత్రంతో 2003లో నటిగా కెరీర్ ప్రారంభించారు.

* 1999లో నిర్వహించిన ‘మిస్‌ ఇండియా’ కాంటెస్ట్‌లో యుక్తా ముఖీ కిరీటం అందుకుని, ‘పూవెల్లమ్‌ అన్‌ వాసమ్‌’ అనే తమిళ సినిమాతో  తనలోని డ్యాన్సర్‌ని పరిచయం చేశారు. ఆమె తెరపై కనిపించిన తొలి సినిమా (2001) ఇదే.  ఆ తర్వాత, ‘ప్యాసా’ (హిందీ)తో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


* 2000 ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో రన్నరప్‌గా  నిలిచి, అదే ఏడాది ‘మిస్‌ వరల్డ్‌’గా తానెంటో ప్రపంచానికి చాటి చెప్పారు ప్రియాంక చోప్రా. 2002లో ‘తమిళన్‌’ అనే చిత్రంతో నట ప్రస్థానం ప్రారంభించారు.


* దియా మీర్జా 2000 ‘మిస్‌ ఇండియా’ కాంపిటేషన్‌లో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచి, అదే సంవత్సరం ‘మిస్‌ ఏషియా పసిఫిక్‌’ టైటిల్‌ సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌లో పుట్టిన దియాకు మోడలింగ్‌ చేయడమంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే అందాల కిరీటం దక్కించుకున్న ఆమె ‘రెహ్నా హై తేరే దిల్‌ మేన్‌’ అనే హిందీ చిత్రంతో 2001లో నాయికగా పరిచయమయ్యారు.


* 2017లో నిర్వహించిన పోటీల్లో మానుషి చిల్లర్‌ ‘మిస్‌ ఇండియా’, ‘మిస్‌ వరల్డ్‌’ అయ్యారు. దాంతో ‘సమ్రాట్‌ పృథ్వీరాజ్‌’ అనే హిందీ సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు. అక్షయ్‌ కుమార్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.


* 2015లో కిరీటం అందుకున్న అదితి ఆర్య ‘ఇజం’ (తెలుగు) సినిమాతో నటిగా మారారు. బాలీవుడ్‌, శాండిల్‌వుడ్‌లోనూ మెరిశారు. 2013 విన్నర్‌ నవనీత్‌ కౌర్‌ థిల్లాన్‌. ఈమె పలు బాలీవుడ్‌ చిత్రాల్లో కనిపించారు. 2002 మిస్‌ ఇండియా: నేహా ధూపియా. 1994లో ఆమె బాలనటిగా తెరంగేట్రం చేశారు. 2003లో వచ్చిన చిత్రం ‘నిన్నే ఇష్టపడ్డాను’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమ్యారు. 1984లో జుహీ చావ్లా టైటిల్‌ గెలుచుకున్నారు. 1986లో ‘సుల్తానత్‌’ అనే హిందీ చిత్రంతో నటిగా కెరీర్‌ ప్రారంభించారు.


* ఈ ఏడాది పోటీల్లో తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహించనున్న శివాని (జీవితా-రాజశేఖర్‌ల తనయ) (Shivani Rajasekhar) ఆరోగ్య సమస్య, తన అకడమిక్‌ (మెడికల్‌) పరీక్షల కారణంగా తప్పుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని